ఛత్తీస్గఢ్లో ఎదురు కాల్పులు-7 మావోయిస్టులు హతం
అమరావతి: ఛత్తీస్గఢ్లో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య మంగళవారం ఎదురుకాల్పులు చోటు చేసుకున్న సంఘటనలో ఏడుగురు మావోయిస్టులు హతమయ్యారు.. నారాయణ్పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దుల్లోని అడవుల్లో ఈ కాల్పులు చోటు చేసుకున్నట్లు పోలీసులు ధృవీకరించారు.. కాల్పుల్లో చనిపోయిన 7 మావోయిస్టుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు.. పలువురు మావోయిస్టులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.. సంఘటనాస్థలిలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..మహారాష్ట్ర సరిహద్దుకు సమీపంలోని తెక్మేట అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో మావోయిస్టులు సమావేశమైనట్లు పోలీసులకు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది..దీంతో స్పెషల్ టాస్క్ ఫోర్స్, డీఆర్జీ దళాలు సంయుక్తంగా యాంటీ నక్సల్ ఆపరేషన్ చేపట్టాయి.. సోమవారం రాత్రి నుంచే గాలింపు చేపట్టి, మంగళవారం ఉదయం మావోయిస్టులు ఉన్న ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు..పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులు జరిపారు..బలగాలు ఎదురు కాల్పులకు దిగడంతో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు..సంబంధిత ప్రాంతంలో పోలీసుల కూంబింగ్ కొనసాగుతోంది.