పి ఓ,ఏపీవో శిక్షణ తరగతులను పరిశీలించిన కలెక్టర్ హరి నారాయణన్
పోలింగ్ విధులు..
నెల్లూరు: 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ విధులకు హాజరయ్యే పి ఓ లు, ఏపీవోలు ఎటువంటి లోటుపాట్లు లేకుండా సమర్థవంతంగా పోలింగ్ విధులను నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరి నారాయణన్ పిలుపునిచ్చారు. సోమవారం నెల్లూరు నగరంలోని డీకే డబ్ల్యూ కళాశాల, వి ఆర్ లా కళాశాలలో నిర్వహించిన పోలింగ్ అధికారుల శిక్షణా తరగతులను కలెక్టర్ పరిశీలించారు. డీకే డబ్ల్యూ కళాశాలలో శిక్షణా తరగతులను పరిశీలించిన కలెక్టర్ పోలింగ్ అధికారులకు పలు సూచనలు చేశారు. వి ఆర్ లా కళాశాలలో శిక్షణ అనంతరం పోలింగ్ అధికారులకు నిర్వహించిన పరీక్షను కలెక్టర్ పరిశీలించారు. ప్రశ్నాపత్రంలోని పలు ప్రశ్నలను అడిగి ఏ మేరకు శిక్షణ పొందారో పరిశీలించారు. ఈవీఎం మిషన్ వాడకం పై పోలింగ్ సిబ్బందికి ఇస్తున్నశిక్షణను కలెక్టర్ దగ్గరుండి పరిశీలించారు. పోలింగ్ అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమ విధులను నిర్వర్తించాలని, పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరిగేలా తమ వంతు కృషి చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ సూచించారు.కలెక్టర్ వెంట నెల్లూరు, నెల్లూరు రూరల్ రిటర్నింగ్ అధికారులు వికాస్, మలోల, ఏ ఆర్ ఓ జీవి సుబ్బారెడ్డి తదితరులు ఉన్నారు.