శని,ఆదివారాల్లో అన్ని పోలింగ్ కేంద్రాలలో ఓటర్ల నమోదు-కలెక్టర్
నెల్లూరు: ఈ నెల 2, 3 తేదీలలో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ M. హరినారాయణన్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్య్రమం రెండు రోజులు చేపడుతున్నామన్నారు. ఈ రెండు రోజులు సంబంధిత బూత్ స్థాయి అధికారులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ బూత్ లో ప్రజలకు అందుబాటులో ఉండి కొత్త ఓటర్ల నమోదు, తొలగింపులు, మార్పులు చేర్పులకు సంబంధించి 6, 7, 8 ఫారాలను అందించడంతోపాటు పూర్తిచేసిన ఫారాలను కూడా స్వీకరిస్తారన్నారు.18 సంవత్సరాలు పైబడిన వారు ఓటర్లుగా కొత్తగా పేర్లు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇదివరకే ఓటర్ కార్డు కలిగిన వారు చేర్పులు, మార్పుల కోసం కూడా బూత్ స్థాయి అధికారులను సంప్రదించవచ్చన్నారు. ఓటర్లు వారి పేర్లు ఓటర్ల జాబితాలో నమోదైనది లేనిది పరిశీలించు కోవచ్చన్నారు. ప్రజల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తున్న ఈ ఓటర్ల నమోదు ప్రత్యేక కార్యక్రమాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.